కోవిడ్ నేపథ్యంలో 2వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు
విద్యార్థులు, టీచర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు
ఒక్కో విద్యార్థి మధ్య దూరం 6 అడుగులు
టెన్త్ మినహా తక్కిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు
టీచర్లు రోజూ స్కూళ్లకు రావలసిందే
రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు.
ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్లైన్, ఆఫ్లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లే
► నవంబర్ నెలంతా స్కూళ్లు హాఫ్డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
► విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
► ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి
► టెన్త్ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
► ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
► టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి.
ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్లైన్ బోధనలో పాల్గొనాలి.
అకడమిక్ క్యాలెండర్ ఇలా..
► రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.
► నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్ ఉంటుంది.
► ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది.
► తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.
► పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.
► ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
► ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.